Tirumala Shanivaralu: పెరటాశి మాసం: శ్రీవారి అవతారం, పిండి దీపం, ఉపవాస నియమాలు


పెరటాశి మాసం అనేది తమిళ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ కాలంలో భక్తులు విష్ణు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

అవతార విశిష్టత: శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరస్వామిగా అవతరించిన మాసం ఇదేనని శ్రీవేంకటాచల మహత్యం చెబుతోంది. ఈయన శ్రవణ నక్షత్రంలో అవతరించినట్లు నమ్మకం. శనివారం అంటే శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన రోజు.

మూడవ శనివారం ప్రాముఖ్యత: పెరటాశి మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు శనివారాలలో మూడవ శనివారం చాలా విశేషమైనదిగా తమిళులు భావిస్తారు.

పిండి దీప సమర్పణ: ఈ మాసంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి పిండి దీపం సమర్పించడం ఒక ప్రత్యేక ఆచారం. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలలో ఈ ఆచారం విస్తృతంగా కనిపిస్తుంది.

పెరటాశి వ్రతం నియమాలు

పెరటాశి మాసంలో పిండి దీపం వెలిగించేవారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవి:

స్నానం, సుప్రభాతం: ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠించాలి.

తిరు నామం: ఈ ముప్పై రోజుల పాటు నుదుటిపై తిరు నామం ధరించాలి.

ఉపవాసం: నిత్య పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.

పవిత్ర జీవనం: ఈ కాలంలో ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం పాటించడం తప్పనిసరి. అలాగే, మద్యమాంసాలకు దూరంగా ఉండాలి.

ఆలయ సందర్శన: వీలైనంత వరకు ప్రతిరోజూ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి.

నైవేద్యం: ప్రతిరోజూ స్వామివారికి పూజ తర్వాత చక్ర పొంగలి లేదా కట్టు పొంగలి నివేదించాలి.

ముఖ్యమైన తేదీలు

శనివారాలు: సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 27, అక్టోబర్ 4, అక్టోబర్ 11 ఈ నాలుగు శనివారాలలో స్వామివారికి ఆలయంలో లేదా ఇంట్లో పిండిదీపంతో దీపారాధన చేయాలి.

పెరటాశి మాసం (2025): 2025లో పెరటాశి మాసం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు వస్తుంది.

ఈ పవిత్రమైన పెరటాశి మాసంలో భక్తిశ్రద్ధలతో శ్రీనివాసుని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

Comments