తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 29, 30వ తేదీల్లో వైభవంగా జరుగనున్నాయి. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.
తరిగొండలో..
తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 7 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుపతిలో..
ఏప్రిల్ 29, ఏప్రిల్ 30వ తేదీలలో ఉదయం 10 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు జరుగనుంది. ఇందులో ప్రముఖ పండితులు పాల్గొని వెంగమాంబ రచనలపై ఉపన్యసిస్తారు. సాయంత్రం 6 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గాత్ర సంగీత సభ, హరికథ గానం చేయనున్నారు.
ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 9 గంటలకు తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్దగల వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు.
తిరుమలలో..
ఏప్రిల్ 30వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపంనకు ఉభయనాంచారీ సమేతంగా శ్రీవారు పురవీధుల గుండా వేంచేపు చేస్తారు. సాయంత్రం 6 నుండి 7.15 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మరియు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. రాత్రి 7.15 గంటలకు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీస్వామి అనుగ్రహభాషణం చేయనున్నారు.