Tenali Nazarpeta Lakshmi Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నాజరుపేట – చరిత్ర, విశేషాలు, దర్శన సమయాలు

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నాజర్‌పేటలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం క్రీ.శ. 1906 సంవత్సరంలో అప్పటి నాజర్, దివంగత పొన్నాడ వేంకట లక్ష్మీ నరసింహంగారిచే నిర్మించబడింది. ప్రారంభంలో ఈ ప్రాంతానికి లక్ష్మీ నరసింహపేట అని నామకరణం చేయబడింది. అనంతరం పేట అభివృద్ధి చెందిన తర్వాత, ప్రజల ఆకాంక్ష మేరకు మునిసిపాలిటీ వారు దీనికి నాజర్‌పేట అనే పేరు పెట్టారు.

మందిర వ్యవస్థాపకుడైన పొన్నాడ వేంకట లక్ష్మీ నరసింహంగారు వృత్తిరీత్యా నాజర్ కావడంతోనే ఈ నామకరణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

ఈ ఆలయానికి ఎదురుగా రణవీర ఆంజనేయస్వామి ఆలయం కీ.శే. జోస్యుల కృష్ణయ్యగారిచే నిర్మించబడింది. కాలక్రమేణా అభివృద్ధి చెందిన ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠం, గుంటూరు వారి ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

నేలమీద వెలసిన అరుదైన నరసింహ క్షేత్రం

సాధారణంగా నరసింహస్వామి ఆలయాలు కొండలపై లేదా గుహలలో ఉంటాయి. అయితే, నేలమీద నిర్మించబడిన నరసింహ ఆలయాలు చాలా అరుదు. అలాంటి విశిష్ట ఆలయాలలో తెనాలి నాజర్‌పేట ఆలయం ఒకటి కావడం విశేషం.

స్వామివారి విగ్రహ విశేషాలు

శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రంలోని 18వ శ్లోకం ఆధారంగా ఇక్కడి విగ్రహం రూపకల్పన చేయబడింది.
స్వామివారు చతుర్భుజుడుగా దర్శనమిస్తారు.

  • కుడి చేతిలో చక్రం
  • ఎడమ చేతిలో శంఖం
  • ఒక చేతితో అభయ ముద్ర
  • మరో చేతితో అమ్మవారిని ఆలింగనం

అమ్మవారు కుడి చేతిలో కమలం ధరించి ఉంటారు.
శివ–కేశవ భేదం లేదని సూచించేలా స్వామివారి పీఠం పానువట్టం ఆకారంలో ఉండటం మరో ప్రత్యేకత.

ఇంకొక విశేషం ఏమిటంటే, స్వామికి చేసిన అభిషేక జలం బయటకు వెళ్లే సోమద్వారానికి నంది ముఖం ఉండటం. ఇది తరువాత చెక్కింది కాదు; ఆలయ నిర్మాణ సమయంలోనే రాతితో చెక్కబడింది.

9 సంఖ్యతో అనుగ్రహం

ఈ క్షేత్రంలో 9 సంఖ్యకు విశేష ప్రాధాన్యత ఉంది.
9, 18, 27 ప్రదక్షిణలు చేయడం, లేదా 9, 18, 27 రోజులు అర్చనలు నిర్వహించడం ద్వారా స్వామి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

రణవీర ఆంజనేయస్వామి మహిమ

రణవీర ఆంజనేయస్వామి ప్రతిష్ట కూడా అరుదైనదే. సాధారణంగా పెంచలకోన వంటి క్షేత్రాలలో స్వామి ఆలయ ప్రాంగణంలో ఉంటారు గానీ, ఇక్కడ స్వామికి అభిముఖంగా ప్రతిష్ట చేయబడడం విశేషం.
రణవీర ఆంజనేయస్వామి ఉగ్ర రూపాలలో అత్యంత ఉగ్ర రూపం కలవారు. భక్తులు నిష్టతో చేసిన సేవలు అతి త్వరగా ఫలితాన్ని ఇస్తాయని అనుభవాలు చెబుతున్నాయి.

దర్శన సమయాలు

  • ఉదయం: 6.00 గం. – 11.00 గం.
  • సాయంత్రం: 6.00 గం. – 8.00 గం.

వసతి సౌకర్యాలు

తెనాలిలో భక్తులకు వసతి, భోజనానికి అనువైన హోటల్స్ అనేకం ఉన్నాయి. అదేవిధంగా సమీపంలోని వైకుంఠపురంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కూడా ప్రసిద్ధ దర్శనీయ స్థలం.

No comments