Maha Shivaratri: మహాశివరాత్రి పూజలో చేయవలసినవి, చేయకూడనివి
మహాశివరాత్రి నాడు చేయాల్సినవి
మహాశివరాత్రి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి, ఉపవాస దీక్షను స్వీకరించి పరమశివుని ధ్యానం చేయాలి. ముందుగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అనంతరం ఇంటికి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయాలి.
అభిషేక సమయంలో శివయ్యకు ప్రీతికరమైన పూజా ద్రవ్యాలను సమర్పించాలి, అవి:
- బిల్వ పత్రాలు
- జమ్మి ఆకులు
- గంగాజలం
- పాలు
- పువ్వులు
- తేనె
- ఉమ్మెత్త పువ్వులు
ఇవి సమర్పిస్తూ “ఓం నమః శివాయ” మంత్రాన్ని జపించడం అత్యంత శుభప్రదం. అలాగే మహామృత్యుంజయ మంత్రం సహా వివిధ శివ మంత్రాలను పఠించడం ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. రాత్రి జాగరణ చేసి శివనామస్మరణ, భజనలు, అభిషేకాలు నిర్వహించడం మహాశివరాత్రి ఆచరణలో ముఖ్యమైన భాగం.
మహాశివరాత్రి నాడు చేయకూడనివి
ఈ పవిత్ర దినాన శుద్ధాచరణ చాలా ముఖ్యం. కాబట్టి కొన్ని నియమాలను తప్పక పాటించాలి.
- మాంసాహారం తీసుకోకూడదు
- మద్యం సేవించకూడదు
- ఉల్లి, వెల్లుల్లి వంటి తామసికాహారాలను నివారించాలి
అలాగే శివపూజలో సమర్పించరాని కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి:
- తులసి ఆకులు
- పసుపు
- కుంకుమ
- కొబ్బరి నీళ్లు
ఇవన్నీ శివార్చనలో ఉపయోగించరాదు. అదేవిధంగా శివలింగ పూజలో శంఖం ఉపయోగించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది.

Post a Comment