అత్రి అగస్త్యుల సంవాదం
అగస్త్య మహాముని అత్రి మహామునుల సంవాదమును గురించి ఇంకను వశిష్ఠులవారు ఈ విధముగా చెబుతూ ఇరవైమూడవ రోజు కథను ప్రారంభించాడు. అగస్త్యుడు అత్రిమహర్షితో"ఓ ముని పుంగవా! విజయాన్ని సాధించిన పురంజయుడు ఏమి చేసాడో వివరింపుము అని అడుగగా, అత్రిమహర్షి ఇలా చెప్పసాగాడు.
పురంజయునికి అశరీరవాణి సూచన
"ఓ మహానుభావా! పురంజయుడు కార్తిక వ్రతమును ఆచరించిన ప్రభావం వలన అసమాన బలవంతుడై అగ్ని శేషం, శత్రు శేషం ఉండరాదని తెలిసి తన శత్రువుల నందరిని జయించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుకొనుచుండెను. తన విష్ణు భక్తి వలన గొప్ప పరాక్రమవంతుడు, తేజోవంతుడై ఉండెను. శత్రువులకు సింహస్వప్నం యుండెను. పురంజయుడు ఇప్పుడు అసమాన విష్ణుభక్తి పరాయణుడయ్యాడు. తాను చేస్తున్న పూజలతో తృప్తి చెందక, ఇంకా ఏయే క్షేత్రములలో శ్రీహరిని పూజించిన మోక్షము కలుగునా అని విచారిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి అశరీరవాణి "ఓ పురంజయా! కావేరి నదీ తీరమున శ్రీరంగ క్షేత్రము కలదు. ఆ క్షేత్రమును రెండవ వైకుంఠముగా పిలుస్తారు. కావున నీవు వెంటనే అక్కడకు వెళ్లి శ్రీరంగనాధస్వామిని పూజించి, అర్చించిన యెడల నీకు ఈ సంసార బంధముల నుంచి ముక్తి కలిగి మోక్షమును పొందుతావు". అని పలికెను.
పురంజయుని శ్రీరంగం యాత్ర
అశరీరవాణి మాటలు విన్న పురంజయుడు వెంటనే రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, పుణ్య నదులలో స్నానం చేస్తూ శ్రీరంగమునకు చేరుకున్నాడు. అక్కడ కావేరి నదీ తీరమున గల శ్రీరంగనాధుని దర్శించి "ఓ దామోదరా! గోవిందా! గోపాలా! అనంతా! అచ్యుతా! హృషీకేశా! దాసోహం,పరమాత్మా దాసోహం"అని పరిపరి విధములుగా విష్ణు స్తోత్రము చేసి కార్తిక మాసమంతా శ్రీరంగం నందు గడిపి తరువాత సపరివారంగా అయోధ్య నగరమునకు చేరుకున్నాడు.
రాజు వ్రతంతో సుభిక్షంగా రాజ్యం
పురంజయుడు చేసిన కార్తిక వ్రత మహత్యం వలన అతని రాజ్యము నందు ప్రజలు అందరూ సిరిసంపదలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లసాగారు. పురంజయుని రాజ్యములోని వీరులందరూ యుద్ధ నేర్పరులై, రాజనీతి కలిగి ఉండేవారు. ఇంకా ఆ నగరంలోని స్త్రీలు, అత్యంత సుందరీమణులుగా పేరు తెచ్చుకున్నారు. అంతే కాక సంగీత నాట్య చిత్రలేఖనం వంటి కళలలో కూడా ఆరితేరిన వారయ్యారు.
వాన ప్రస్థానికేగిన పురంజయుడు
శ్రీరంగమున కార్తిక మాస వ్రతమును చేసి ఇంటికి తిరిగి వచ్చిన పురంజయునికి అయోధ్య నగర పౌరులు మంగళవాయిద్యాలతో ఎదురేగి స్వాగతించారు. ఇక ఆనాటి నుంచి పురంజయుడు మరింత దైవభక్తి పరాయణుడై ప్రతి ఏడూ కార్తిక మాస వ్రతము ను ఆచరిస్తూ, రాజ్యపాలన చేస్తూ ఉండెను. కొంతకాలానికి పురంజయునికి వృద్ధాప్యము రాగా, తన కుమారునికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానికి అడవికి బయలుదేరి వెళ్లెను. అతడు అడవిలో కూడా ప్రతి సంవత్సరం కార్తిక మాస వ్రతమును చేస్తూ క్రమంగా ముసలితనమున మరణించి వైకుంఠమునకు చేరాడు. కావున! "ఓ అగస్త్యా! కార్తిక వ్రతం అత్యంత ఫలప్రదమైనది. దానిని అందరూ ఆచరించవలెను. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును". అని అత్రిముని అగస్త్యునితో చెప్పడం ముగించాడు. ఇక్కడితో అత్రిముని అగస్త్యునకు చెప్పుచున్న పురంజయుని కథను పూర్తి చేస్త వశిష్ఠులవారు జనకునితో "ఓ జనకరాజా! చూసావుగా కార్తిక వ్రతమునకు ఎంతటి మహత్తు కలదో" అని చెబుతూ ఇరవైమూడవ రోజు కథను ముగించాడు. ఇతి స్కాంద పురాణే! కార్తిక మహాత్మ్యే! త్రయోవింశాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!
