Karthika Puranam: కార్తీక పురాణం 8వ అధ్యాయము - సూక్ష్మధర్మనిరూపణము, అజామిళోపాఖ్యానము

 సూక్ష్మధర్మనిరూపణము, అజామిళోపాఖ్యానము

వసిష్ఠమునీంద్రా ! నా మనస్సులో గొప్ప సందేహము గలిగినది. ఆ సందేహమును దెలిపెదను, దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మసూక్ష్మమును జెప్పితిరి, పాతకము లలో గొప్పవానిని జెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములయిన ప్రాయశ్చిత్తములను జేసికొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రము అందు చెప్పబడియుండగా మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందు దురని చెప్పినారే, అదియెట్లు సంభవమగును?

ఓ మునీశ్వరా ! అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తికదీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లు సంభవించును.

వజ్రపర్వతమును గోటికొన చివరిభాగముచేత చూర్ణముచేయుటకు శక్యమగునా? తాను లోపలనుండి గృహమునకు అగ్నినిముట్టించి మందు చుండగా తెలియనివానివలె ఉండి పుడిసెదు నీల్బు అనగా చేతికివచ్చినన్ని జలము అగ్నిమీద చల్లినయెడల ఆ అగ్నిచల్లాజునా? మహానదీ ప్రవాహములో స్వయముగా పడికొట్టుకొనిపోవుచు గడ్డిపరకను ఆధారముగాచేసి కొనిన దరికిజేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడనుండి క్రిందకిపడుతూ మధ్యనున్న చిన్నతీగను పట్టుకున్న యెడల పదకుండునా? ఇట్టి దృష్టాంత ములనుబట్టి చూడగా అధికములయిన పాపములను జేసి స్వల్పపుణ్యముచేత వాటిని నశింపజేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయుము. నాకే గాదు వినువారికందరికిని ఇది ఆశ్చర్యకరమే.

కార్తిక మాఘ వైశాఖమాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పినారు. అది యెట్లు సిద్ధించును? సూతుడిట్లు పల్కెను. ఈ ప్రకారముగా రాజు మాటలను విని వసిష్ట మునీంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యముచేత పెద్దపాపములెట్లు నశించునో, అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను.

ఓ రాజా! వినుము. మంచి విమర్శచేసితివి. నేను గూడ విచారించి తిని వేద శాస్త్రపురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మము లున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంతపనినైన చేయసమర్థ ములు. ఒకానొకప్పుడు గొప్పపుణ్యము గూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్పపుణ్యమే అధికఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకుము. చెప్పెదను సావధానముగా వినుము.

ధర్మములు, గుణత్రయముతో గూడుకొని స్వల్పాధికములగును. గుణములు, సత్వము, రజస్సు, తమస్సు అనునవిమూడు. ఈ మూడు గుణములును ప్రకృతి వలన గలిగినవి. ప్రకృతియనగా మాయ.

అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నియు తమస్సు వలన కర్మకాండయంతయు రజో గుణము వలన గలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము.

ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు జెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినొందును. దేశ మనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యు డైన బ్రాహ్మణుడు. ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధి రహితముగాను, మంత్రరహితముగాను చేయుదానాదికము తామసమనబడును. ఇది ఎంతగొప్పదయినను సర్వపాపనాశన సామర్ధ్యము గలది గాదు.

ఓ జనక మహారాజా! దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును.

ధర్మము అధికమో స్వల్పమో కాలమునుబట్టి విచారించి నిశ్చయించ వలెను. కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలులేదని భావము.

అట్లు దేశకాలవిచారణచేసిన ధర్మము వలన సుఖమును బొందు దురు. కాబట్టి జ్ఞానముచేతగాని, అజ్ఞానముచేతగాని దేశకాలపాత్ర విచారణతో చేసిన శర్మము అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందియములేదు. 

పర్వతము యెత్తునకట్టెలను పేర్చి అందులో గురవిందగింజంత అగ్నిని ఉంచిన యెడల ఆ కట్టెలన్నియు బూడిదయగును. గృహములోని చీకటిని చిన్నదీపమును వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మలజలమందు ఒకమారు స్నానమాచరించిన యెడల ఆ మురికిపోవును అట్లే అల్ప పుణ్యము చేత అధికపాపములు నశించగలవు.

అజ్ఞానముచేతగాని, జ్ఞానముచేతగాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదయినను హరినామసంకీర్తనముచే పాపములన్నియు వెదురు పొదలను అగ్నివలె దహించును.

పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము. పూర్వకాల మందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదవేదాంగపారంగతుడై సత్వనిష్ఠుడను నొక బ్రాహ్మణుడు గలదు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్యగలదు. వారిరువురకు చివరికాలమున అజామిళుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిళుడు దురాచారుడును, దాసీభర్తయు, హింసకు దును, నిత్యము దాసీసాంగత్యమందు ఆసక్తిగలవాడై యుండెను. అట్టివాడు స్వల్పపుణ్యముచేత అనగా తెలియక చేసిన హరినామసంకీర్తనము వలన తరించెను.

ఆ అజామిళుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనిన అజామిళునకు యౌవనము రాగానే ఒక దుష్టబ్రాహ్మణుని యింటిలో ఒకదాసీయున్నది. దానితో సంగమముచేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచికామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలయందాసక్తిగలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను.

ఆ అజామిళుడిట్లు కులాచారభ్రష్టుడైన కారణమును బంధువులందరు అతనిని గృహమునుండి వెళ్ళగొట్టిరి, అజామిళుడు ఆయూరిలోనే యొక చండాలుని యింటిలో నివాసము చేసికొని నిత్యము దాసీతో గూడి కుక్కలను పుచ్చులువేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకుపోయి పశువులను, పక్షులను, సృగములను ఇంపి వాటిమాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను.

ఇట్లుండగా ఒకనాడు ఆదాసీ కల్లు ద్రాగుదమను యాశతో తాటి చెట్టిక్కి కమ్మవిరిగి క్రిందబడి మృతిబొందెను. తరువాత అజామిళుడు భార్యను జూచి తన ప్రాణములకంటే అధికప్రియమైనది. గనుక చచ్చిన శవమును తనముందు ఉంచుకొని వికలుడై బహు శోకించి తరువాత దానిని కొండగుహయందు పారవైచి యింటికి బోయెను. తరువాత అజామిళుడు యౌవనవంతురాలయిన దాని కూతురుచూచి పాపాత్ముడు గనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. 

తరువాత అజామిళునకు ఆ కూతురి యందు కొందరు పుత్రులు గలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి నారాయణ అను నామకరణము చేసి అజామిళుడు నడుచునప్పుడును, కూర్చుండునప్పుడును, జలపానకాలమందును, భోజనము చేయునప్పు దును, తిరుగుచున్నప్పుడును పుత్రపాశముచేత బద్ధుడై నిరంతరము ఆ నామముచే (నారాయణనామమునే) పలుకుచుండెను.

తరువాత కొంతకాలమునకు అజామిళునకు మరణకాలము సమీపింపగా అతనిని తీసికొనిపోవుటకుగాను ఎఱ్ఱనిగడ్డములు మీసములుగలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి.

అజామిళుడు తనను దీసికొని పోవవచ్చిన యమదూతలను జూచి భయపడి పుత్రస్నేహముచేత దూరమందాటలోనున్న కుమారుని నారాయణ, నారాయణాయని పిలిచెను. ఆ పిలుచునప్పుడు భయముచేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణా యని పలుమాఱులు పిలిచెను.

రాజా! దైన్యముతోగూడి నారాయణ నామసంకీర్తనమును మరణకాలమందు అజామిళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతు లైన విష్ణుదూతలువచ్చి యమదూతలను జూచి ఓయీ! ఈ అజామిళుడు మావాడుగాని మీవాడుగాదని పలికిరి.

రాజా! ఆ విష్ణుదూతలు పద్మములవలె విశాలములయిన నేత్రములుగలవారును. పచ్చని పట్టుబట్టలను ధరించినవారును, పద్మమాలాలంకృతులును, కిరీటవంతులును, కుండలధారులును, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు గలవారును, నాలుగు చేతులు గలవారును, సుందర దేహులును, శంఖచక్రములను ధరించినవారును, తమ కాంతిచేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయిఉండిరి. ఇట్టి విష్ణుదూతలను జూచి యనుదూతలు ఇట్లనిరి.

మీరు ఎవ్వరు! కిన్నరులా! సిద్దులా! చారణులా! దేవతలా! అని యడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుని తమ పుష్పకవిమానము ఎక్కించుకుని తమ లోకమునకు తీసికొని పోవుకోర్కె గలవారై ఇట్లు పలికిరి.

Comments

Popular Posts