Karthika Puranam: కార్తీక పురాణం 5వ అధ్యాయము - పురాణవరసమాహాత్మ్యము, శత్రుబిచ్ఛరిత్రము

పురాణవరసమాహాత్మ్యము, శత్రుబిచ్ఛరిత్రము

వసిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనకమహారాజా! వినుము. కార్తికమాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును జేయవలయును. పుణ్యముచేత పాపము నశించుటయే గాక పుణ్యమధికమగును.

కార్తికమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును జేయువాడు పాము కుబుసమునువలె పాపములను విడుచును. కార్తికమాస మందు తులసీదళములతోను, తెల్లనివి నల్లనివినైన అవిశపూలతో కరవీర- గన్నేరుపూలతోను హరిని పూజించిన యెడల వైకుంఠమునకుబోయి హరితో గూడా సుఖించును. కార్తికమాసమున భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరిసన్నిధిలో పారాయణచేయువాడు వైకుంఠ లోకమునకు అధిపతియగును.

కార్తికమాసమందు హరిసన్నిధిలో శ్లోకముగాని, శ్లోకపాదముగాని పురాణము చెప్పినవారును, విన్నవారును కర్మబంధవినిర్ముక్తులగుదురు. కార్తికమాసమందు శుక్లపక్ష మందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాల మందును చండాలురయొక్కయు, పాపాత్ములయొక్కయు, శూద్రులయొక్కయు, అశౌచ వంతులయొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తికమాసమందు వనభోజనమాచరించవలయును.

అనేకజాతి వృక్షములతోగూడిన వనమందు అమలక (ఉసిరిగ) వృక్షమువద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షతాదులతో బూజించి శక్తి కొలది బ్రాహ్మణులను బూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తికమాస మందు వనభోజనముచేసిన యెడల ఆయాకాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక కార్తికమందు వనభోజనమాచరించవలయును.

కార్తికమాహాత్మ్యమును భక్తితోవిని బ్రాహ్మణుని కుమారుడు నీచజన్మ నుండి ముక్తుడాయెను. రాజిట్లు అడిగెను. ఓ మునీశ్వరా! బ్రాహ్మణుని కుమారుడెవ్వడు? వాడేమి కర్మచేసెను? దేనిచేత విముక్తుదాయెను? ఈ వృత్తాంతమును వినవలయునని కుతూహల పడుచున్నాను. వసిష్ఠుడిట్లు పల్కెను. జనకమహారాజా ! చెప్పెదను వినుము. కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదవేదాంగపారంగతుడు గలదు.

ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును జూచి తండ్రీ నాయనా ! నీకుపాపములు నశించెడి ఒకమాటను జెప్పెదను. కార్తికమాస మందు ప్రాతస్నానము చేయుము. సాయంకాలమందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రి చెప్పిన మాటలనువిని కుమారుడు కార్తికమాస ధర్మమనగా యేమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికి చేయతగదు. ఆ మాటవిని తండ్రి ఓరి దుర్మార్గా! ఎంతమాట అంటివిరా, నీవు అరణ్యమందు చెట్టుతొజ్జలో ఎలుకవై పుట్టి ఉందుమని శపించెను.

తండ్రి శాసమును విని కుమారుడు పశ్చాత్తాపపడి శాపవిముక్తిని దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును. అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లుఅనెను. కుమారకా ! ఎప్పుడు నీవు కార్తిక మాహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి యిట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టుతొఱ్ఱలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైయున్నది. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీకస్నానమాచరించి ఆ వృక్షముయొక్క మొదట కార్తికమహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను.

అంతలో దురాచారుడును, హింసకుడును అగు ఒకకిరాతుడును వేటనిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను జూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పనివల్ల ఏమిఫలము అని యడిగెను. కిరాతకునిచే అడుగబడి విశ్వామిత్రుడిట్లు చెప్పెను. కిరాతా! వినుము చెప్పెదను నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తిక ధర్మము ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును.

కార్తికమాసమందు మోహము చేతనైనను స్నానదానాదికమును జేసిన వాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. కార్తికమాసమందు భక్తిశ్రద్ధలతో కూడినవాడై స్నానదానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడు అగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పినకార్తిక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుకవిని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను.

విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసికొని తన ఇంటికి బోయెను. కిరాతుడును, మూషకదేహ త్యాగమునుబట్టి కార్తిక వ్రతఫలమును జూచి తరువాత ముని వలన సకల ధర్మములనువిని వైకుంఠముజేరెను. సుగతిని గోరువారు కార్తిక మాహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెదరు. కాని విద్వాంసుడు తెలిసి కార్తిక ధర్మమును విని అభ్యసించవలెను.

కాబట్టి తప్పక కార్తీకవ్రతము ఆచరించదగినది. ఇది నిజము. ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా! నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లయిన యెడల పుణ్యగతికి బోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు. నిశ్చయము.

Comments

Popular Posts